మహా : పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనాల్లో తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత మూడేళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్ల ఛార్జీలను పెంచుతున్నట్లు పేర్కొంది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. తెలంగాణ ఆర్టీసీ 20 శాతానికి పైగా బస్ పాస్ రేట్లను పెంచింది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర రూ.1,400కు పెరగగా.. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర రూ.1,600కు పెరిగింది. లనే రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1,800కు పెరిగింది.
బస్ పాస్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత ఈరోజు బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మంగళవారం జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున బస్ భవన్ చేరుకున్నారు. బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించిన కవిత నిరసన వ్యక్తం చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు. బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అరెస్ట్ చేసి.. కంచన్ బాగ్ స్టేషన్కు తరలించారు.
కవిత దర్నాకు బీఆర్ఎస్ దూరం
బస్ భవన్ వద్ద కవిత నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి దూరంగా ఉన్నాయి. గతంలో జాగృతి తరఫున ధర్నాలు, కార్యక్రమాలను నిర్వహించినపుడు కొంత మంది గులాబీ కండువాలతో పాల్గొనేవారు కానీ ఈ ధర్నాలో ఒక్క గులాబీ కండువా కూడా కనిపించకపోవడం చూసతుంటే బీఆర్ఎస్ తో కవిత దాదాపు తెగతెంపులు చేసుకున్నారన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది.







