బోనకల్ – మహా.
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తహశీల్దార్లు ఏ. పున్నం చందర్, ఆర్. రాంబాబు లు అన్నారు. మంగళవారం బోనకల్ మండలం సీతానాగారం, తూటికుంట్ల గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలకు సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్లు మాట్లాడుతూ, రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రత భావాన్ని తావు నీయకుండా జవాబుదారుతనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్ధం అయ్యేలా సామాన్య, గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి చట్టం ఉందన్నారు.
హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు భూ భారతి లో అవకాశం ఉందన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేయవచ్చన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టంలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని తెలిపారు. భూదార్ కార్డుల జారీ జరుగుతుందన్నారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి, ఎవరైనా ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం చట్టంలో ఉందన్నారు
హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉంది రికార్డులో లేనివారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా సీతానాగారం గ్రామంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 29, తూటికుంట్ల గ్రామ రెవెన్యూ సదస్సులో 91 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులకు అధికారులు రశీదులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోనకల్ మండల ఆర్ఐలు నవీన్, మైథిలి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.







