మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు పొందిన జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడి నరమేథానికి పాల్పడటాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దారుణమని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఓవైసీ కోరారు. ఈ ఉగ్రదాడికి నిఘా వైఫల్యమే కారణమని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దారుణ ఘటన ఉరి, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని వాపోయారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పుతుందని భావిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు.







