మహా: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం ఆకస్మికంగా గుండెనొప్పితో బాధపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. ఇక రంగారెడ్డి మృతి నేపథ్యంలో రాజకీయ నాయకులు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మరణం బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. అలాగే మాగం రంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. తన కుటుంబ సభ్యులకు ఇంద్రసేనారెడ్డి సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న రంగారెడ్డి కోలుకుంటారన్న తరుణంలో ఇలా జరగడం విషాదమని ఆయన పేర్కొన్నారు.







