Mahaa Daily Exclusive

  డిజిటల్‌ ప్రపంచంలో పిల్లలకు పటిష్టమైన ఫైర్‌వాల్స్‌ అవసరం…

Share

డిజిటల్‌ ప్రపంచంలో పిల్లలకు పటిష్టమైన ఫైర్‌వాల్స్‌ అవసరం.
* ఏజ్‌ వెరిఫికేషన్‌, తల్లిదండ్రుల సమ్మతిపై కేంద్రానికి నోటీసులు.
• చిన్నారుల సోషల్‌ మీడియాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

న్యూఢిల్లీ, మహా.

చిన్నారుల సోషల్‌ మీడియా వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్‌ ప్రపంచంలో పిల్లలను రక్షించేందుకు స్పష్టమైన పరిమితులతో పాటు పటిష్టమైన రక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడింది. చిన్నారులను ఆన్‌లైన్‌ గ్రూమింగ్‌, లైంగిక వేధింపులు, సెక్స్‌టార్షన్‌, సైబర్‌ బుల్లీయింగ్‌ వంటి ప్రమాదాల నుంచి కాపాడేందుకు సమర్థమైన వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.

జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్‌ (JRCA) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై స్పందన కోరుతూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.

18 ఏళ్లలోపు పిల్లలు స్వతంత్రంగా సోషల్‌ మీడియా ఖాతాలు తెరవడం, వాటిని వినియోగించడంపై పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది హెచ్‌.ఎస్‌. ఫూల్కా ఆందోళన వ్యక్తం చేశారు. భారత కాంట్రాక్ట్‌ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారికి ఒప్పందాలు చేసుకునే పూర్తి సామర్థ్యం లేదని, అలాంటప్పుడు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లతో వారు చేసుకునే ఒప్పందాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌ వంటి కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 13 ఏళ్ల వయసు నుంచే ఖాతాలను అనుమతిస్తున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల వయసును నిర్ధారించేందుకు పటిష్టమైన ఏజ్‌ వెరిఫికేషన్‌ వ్యవస్థ, తల్లిదండ్రుల సమ్మతిని నిర్ధారించే సమర్థవంతమైన విధానం లేకపోవడం వల్ల చిన్నారులు ఆన్‌లైన్‌ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

ఆన్‌లైన్‌ గ్రూమింగ్‌, లైంగిక వేధింపులు, సెక్స్‌టార్షన్‌, సైబర్‌ బుల్లీయింగ్‌ వంటి సమస్యలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిల్లల భద్రతకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కోరారు.

ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు “భారత్‌లో కొన్ని రక్షణ చర్యలు అవసరం” అని వ్యాఖ్యానించింది. పిల్లల ఆన్‌లైన్‌ భద్రతను దృష్టిలో పెట్టుకుని 2021 ఐటీ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయడం లేదా కొత్త మార్గదర్శకాలను రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా పిల్లల వయసు నిర్ధారణ, తల్లిదండ్రుల సమ్మతి వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇదిలా ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌కు ప్రకటనలు వచ్చినట్లు బీబీసీ కథనంలో పేర్కొన్న ఆరోపణలపైనా కోర్టు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. పిల్లలకు డిజిటల్‌ వేదికలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వారి భద్రతకు తగిన రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సోషల్‌ మీడియా సంస్థలపై ఉందన్న అంశం ఈ విచారణతో మరోసారి చర్చనీయాంశమైంది.