Mahaa Daily Exclusive

  పరకాల టికెట్‌పై కొండా సుష్మిత కీలక వ్యాఖ్యలు..! బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని రేవంత్‌పై ఆరోపణలు..

Share

  • రేవూరికి టికెట్‌ ఎలా ఖరారు చేస్తారని నిలదీత
  • కొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్న
  • బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని రేవంత్‌పై ఆరోపణలు

పరకాల, మహా : రాష్ట్ర కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ టికెట్‌ వ్యవహారం మరోసారి వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మరోసారి టికెట్‌ ఇస్తామని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని సుష్మిత నిలదీశారు. పరకాలలో రేవూరి ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టికెట్లను పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, నేతలు కాదని అన్నారు. తన తండ్రి కొండా మురళిని రేవంత్‌రెడ్డి ఎందుకు పక్కన పెడుతున్నారని సుష్మిత ప్రశ్నించారు. కొండా మురళి సాధారణ నేత కాదని, కింగ్‌ మేకర్‌ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌లో తొలుత కోరింది కొండా దంపతులేనని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత రేవంత్‌రెడ్డి తమ ఇంటికి వచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సుష్మిత పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. సంగారెడ్డి టికెట్‌ను అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాల విషయంలో మాత్రం తానే ఎలా నిర్ణయం చెబుతారని నిలదీశారు. యువతకు టికెట్లు ఇవ్వాలని చెబుతూ రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తామని చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం పదవిని కాపాడుకోవాలంటే నిబద్ధత అవసరమని వ్యాఖ్యానించారు.

బీసీల పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొన్న ప్రభాకర్ ఫొటో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. టీ పీసీసీ చీఫ్ బీసీ నేత అయినప్పటికీ బీసీల పట్ల జరుగుతున్న వివక్షపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా సుష్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరో ‘పొంగు’ ఉందని, ఆ పొంగు ఎక్కువ కాలం ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరో తెలియని పరిస్థితి ఉందంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Latest