Mahaa Daily Exclusive

  నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు..! ఏపీ గ్రీన్‌’ చైర్మన్‌గా నియామకం..!

Share

  •  ఏపీ గ్రీన్‌’ చైర్మన్‌గా నియామకం!
  •  నాగేంద్రబాబుకు కేబినెట్‌ హోదా.
  •  2047 నాటికి రాష్ట్రంలో ఫారెస్ట్‌.
  •  ట్రీ కవర్‌ 50 శాతానికి పెంపు.

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తరణ, పునరటవీకరణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ జీవో ఆర్టీ నంబర్‌–93 ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
నాగేంద్రబాబుకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, రీఫారెస్టేషన్‌ కార్యక్రమాల అమలులో ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌!
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఫారెస్ట్‌, ట్రీ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచడం ఏపీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున పునరటవీకరణ, చెట్ల పెంపకం, పచ్చదనం విస్తరణ కార్యక్రమాలను చేపట్టనుంది.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాలను కేవలం అటవీ శాఖకే పరిమితం చేయకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీన్‌ ఏజెన్సీలు
ఏపీ గ్రీన్‌ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా పచ్చదనం పెంపు, పునరటవీకరణ, చెట్ల సంరక్షణ, అటవీ విస్తరణకు సంబంధించిన కార్యక్రమాలను ఈ ఏజెన్సీలు పర్యవేక్షించనున్నాయి.
రాష్ట్రస్థాయిలో ఏపీ గ్రీన్‌ గవర్నింగ్‌ బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, జిల్లా స్థాయిలో గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
నాగబాబుకు కీలక బాధ్యత
ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా నాగేంద్రబాబు రాష్ట్ర గ్రీన్‌ లక్ష్యాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల పర్యవేక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏపీ గ్రీన్‌, జిల్లా గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీల కార్యకలాపాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయన నేతృత్వంలోని కమిటీని ఆదేశించింది.
పునరటవీకరణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించడం, జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం, పచ్చదనం విస్తరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వంటి అంశాల్లో కమిటీ కీలకంగా వ్యవహరించనుంది.
కేబినెట్‌ ర్యాంక్‌తో మరింత ప్రాధాన్యం
ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా నియమించిన నాగేంద్రబాబుకు కేబినెట్‌ ర్యాంక్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఈ హోదా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
‘గ్రీన్‌ ఏపీ’పై ప్రభుత్వం ఫోకస్‌
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, పట్టణ–గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని విస్తరించడం వంటి లక్ష్యాలతో ఏపీ గ్రీన్‌ కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.
2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం ఫారెస్ట్‌, ట్రీ కవర్‌ సాధించాలన్న భారీ లక్ష్యం నేపథ్యంలో.. నాగేంద్రబాబుకు ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా కేబినెట్‌ హోదాతో బాధ్యతలు అప్పగించడం కీలక పరిణామంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌ కార్యక్రమాల అమలులో ఈ కొత్త వ్యవస్థ ఎంత మేరకు ఫలితాలు సాధిస్తుందనేది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.

Latest