హనుమకొండ, మహా;
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరంగల్ నగరంలోని ఓసిటీ ఎదురుగా, నూతన కలెక్టరేట్ పక్కన ఈరోజు జరగనున్న వేడుకల ప్రాంగణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, రోడ్ల శుభ్రత, పచ్చదనం, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం లేకుండా నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఖిలా వరంగల్ లోని అమరవీరుల స్తూపం వద్ద కూడా ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రెడ్డి, సిహెచ్ ఓ లక్ష్మారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.








