ఖమ్మం సిటీ, మహా.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పందించాలని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు త్రాగునీరు, పాలు, ఆహారం, దుస్తులు వంటి అవసరాలు తక్షణమే అందించాలన్నారు. ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు. అవసరమైనచోట ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అత్యవసర వైద్య సహాయం, మందులు అందించాలన్నారు. బిఆర్ఎస్ నాయకులు సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ వంతు సహాయాన్ని అందిస్తూ, ప్రతి ఒక్కరికీ ధైర్యం కలిగించాలి అని నామ కోరారు.








