Mahaa Daily Exclusive

  14 మంది మావోయిస్టు సభ్యులు లొంగుబాటు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు..!

Share

భద్రాద్రి కొత్తగూడెం మే 6 (మహా): 14 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహిత్ రాజు తెలిపారు. మంగళవారం కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు. వివిధ క్యాడర్ లో పనిచేస్తున్న 14 మంది సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగిందని వివరించారు. నక్సలిజంలో కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉండటం వల్ల వీటిని గమనించిన కొంతమంది సభ్యులు లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం తరఫున అనేక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. లొంగిపోయిన వారికి వెంటనే 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని తర్వాత ఉపాధి కొరకు దశలవారీగా ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ క్యాడర్ లో ఉన్న వారంతా తమ ఆయుధాలను విడిచిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లు వివరించారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 257 మంది వివిధ హోదాల్లో ఉన్న మావోయిస్టు సభ్యులు లొంగిపోయినట్లు తెలిపారు. గత కొంతకాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రజల్లో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతం తో పాటుగా ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలు జీవనం సాగించడానికి నిత్యం సంచరించే ప్రదేశాలలో మందు పాతర్లను అమర్చుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకుల దుశ్చర్యలతో ఆదివాసీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. కొంతమంది అమాయక ఆదివాసీలను పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో చంపడం, హింసించడం జరుగుతుందన్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సభ్యులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయి వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. లొంగిపోయిన సభ్యులకు పునరావాసం, జీవనోపాధి కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Latest