ఆదిలాబాద్ మహా : 18 సంవత్సరముల లోపు పిల్లలు మైనర్లు వాహనాలు నడప రాదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా డ్రైవింగ్ చేసి పట్టబడిన మైనర్ల తల్లిదండ్రులకు శనివారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. మైనర్స్ డ్రైవింగ్ చేయడం నేరమని, చట్టరీత్యా ఇకనుండి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులు తల్లిదండ్రులపై కూడా కేసులు పెడతామని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన పిల్లలకు డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవడానికి తగిన సహాయం అందజేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 295 మైనర్లు వాహనాలతో పట్టుబడ్డారని, 295 వాహనాలను సీజ్ చేసామన్నారు, కౌన్సిలింగ్ అనంతరం సీజ్ చేసిన వాహనాలను పిల్లల తల్లిదండ్రులకు అప్పగించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పకుండా లైసెన్సును కలిగి ఉండాలని లైసెన్సు తీసుకునే క్రమంలో రోడ్డు నియమాలను నిబంధనలను నేర్చుకొని లైసెన్స్ ని పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సిహెచ్ కరుణాకర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు








