Mahaa Daily Exclusive

  తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గడల సీతారామయ్య: భాగం హేమంతరావు..

Share

  • భూమి, భుక్తి, హక్కుల కోసం సాగిన వీరోచిత పోరాటం.. అణగారిన వర్గాలను చైతన్యపరిచిన కమ్యూనిస్టులు
  • సాయుధ పోరాట చరిత్రను నేటితరం తెలుసుకోవాలి.. యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

ఖమ్మం, మహా: తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజల హక్కుల కోసం జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన గడల సీతారామయ్య గొప్ప పోరాట యోధుడని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సభ్యుడు కామ్రేడ్‌ భాగం హేమంతరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా బుధవారం కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో అమరజీవి కామ్రేడ్‌ గడల సీతారామయ్య స్థూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామ శాఖ కార్యదర్శి యాస వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గడల సీతారామయ్య స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భూమి.. భుక్తి.. హక్కుల కోసం పోరాటం

తెలంగాణ సాయుధ పోరాటం ఐదేళ్లపాటు భూమి, భుక్తి, హక్కుల కోసం సాగిన ప్రజా ఉద్యమమని భాగం హేమంతరావు అన్నారు. నిజాం నవాబు పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, మహిళలు ఎదుర్కొన్న అకృత్యాలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలను చైతన్యపరిచి సాయుధ పోరాట యోధులు వీరోచితంగా ప్రతిఘటించారని వివరించారు.

సాయుధ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది అమరులయ్యారని, వేలాది గ్రామాల్లో ప్రజా పాలనకు ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర ఈ పోరాటానికి ఉందని తెలిపారు. ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కమ్యూనిస్టు ఉద్యమం కీలక పాత్ర పోషించిందని అన్నారు.

విలీనానికి పోరాటమే కారణం

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి తెలంగాణ సాయుధ పోరాటం కూడా ప్రధాన కారణాల్లో ఒకటని భాగం హేమంతరావు పేర్కొన్నారు. నిజాం నవాబును అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజభరణాలు, సకల హంగులతో సాగనంపిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేవలం హిందూ–ముస్లిం ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు వాస్తవ చరిత్రను నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ముస్లిం యోధుల పాత్రను గుర్తుచేసిన హేమంతరావు

తెలంగాణ సాయుధ పోరాటంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు పాల్గొన్నారని హేమంతరావు అన్నారు. పోరాటానికి సంబంధించిన చరిత్రలో మఖ్దూం మొహియుద్దీన్‌ వంటి నాయకుల పాత్రను గుర్తుచేశారు. బందగీ, షోయబుల్లా ఖాన్‌, కామ్రేడ్‌ రజబ్‌ అలీ వంటి వారు ఎవరి తరఫున పోరాడారో అణగారిన వర్గాల ప్రజలకు తెలుసని అన్నారు.

సాయుధ పోరాటం ప్రజల హక్కులు, భూమి, సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమమని, దాన్ని మతపరమైన ఘర్షణగా మాత్రమే చూడటం చారిత్రక వాస్తవాలను పరిమితం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.

చిత్రహింసలకు గురైనా జెండాను వీడలేదు

గడల సీతారామయ్యను రజాకార్లు చిత్రహింసలకు గురిచేసినా, గుర్రాలతో తొక్కించినా, కొరడాలతో కొట్టినా తాను ఎత్తిన జెండాను వీడలేదని భాగం హేమంతరావు గుర్తుచేశారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.

పార్టీ విస్తరణ కోసం ఖమ్మం సమితితో పాటు కొత్తగూడెం తాలూకా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన నిస్వార్థ నాయకుడిగా గడల సీతారామయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

చరిత్రను నేటితరం చదవాలి

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను, ఆ పోరాటంలో పాల్గొన్న నాయకుల ఆశయాలను నేటితరం తెలుసుకోవాలని భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. చరిత్రను చదివి, పోరాట యోధుల త్యాగాలను అర్థం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు.

పలువురి నివాళులు

కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, జిల్లా సమితి సభ్యులు యర్రా బాబు, దొండపాటి రమేష్‌, పాపగంటి సుదర్శన్‌, మణిగ కోటేశ్వరరావు, స్వర్ణ రమేష్‌, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి గడల భాస్కర్‌రావు, మాజీ సర్పంచ్‌ చల్లా మోహన్‌రావు, నాయకులు పీవీ రావు, ఉపసర్పంచ్‌ చల్లా నరసింహారావు, మాజీ ఉపసర్పంచ్‌ చల్లా నరసింహారావు, దేవస్థానం కమిటీ చైర్మన్‌ మిట్టపల్లి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు బానోత్‌ రామయ్య, లేడిబోయిన సైదులు, బాస వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉపాధ్యాయుడు కొనపర్తి విష్ణుమూర్తి, తుప్పతి మల్లికార్జున్‌, పొట్లపల్లి నరసింహారావు, గడల చిన సూర్యనారాయణ, శ్రీనివాస్‌, భాషా నాగరాజు, యాస కృష్ణయ్య, లకావత్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం నాయకులు యాస వెంకటేశ్వర్లు, తిలక్‌, కాంగ్రెస్‌ నాయకులు గడల నరేంద్రనాయుడు, గాజుల ప్రసాద్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. అమరజీవి కామ్రేడ్‌ గడల సీతారామయ్య స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.