- సీఎం వచ్చాక మాట్లాడతా
- తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తా
- క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చా
- మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, మహా : తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. ఈ విషయంపై తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరించానని, ప్రస్తుతం మీడియా ముందు మాట్లాడేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని ఆమె తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన విమర్శలపై పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై సురేఖ ఇప్పటికే కమిటీకి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటికి తనను బాధ్యురాలిని చేయవద్దని ఆమె ఆ లేఖలో కోరినట్లు సమాచారం.
అయితే, ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వర్గాల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, క్రమశిక్షణా చర్యలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీలో బేటీ అయి మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని, లేకపోతే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








