Mahaa Daily Exclusive

  కబ్జాకోరులకు మల్కాజ్‌గిరి సీపీ షాక్..! వృద్ధురాలికి దక్కిన రూ.40 కోట్ల భూమి..!

Share

  • వృద్ధురాలికి దక్కిన రూ.40 కోట్ల భూమి
  • మల్కాజ్‌గిరి సీపీ సుమతిని ఆశ్రయించిన వృద్ధురాలు
  • రాజకీయ ఒత్తిళ్లను కాదని వృద్ధురాలికి న్యాయం చేసిన సీపీ
  • భూ కబ్జాకు యత్నించిన వారిపై చర్యలకు పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్, మహా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 80 ఏళ్ల ఓ వృద్ధురాలు భూకబ్జాదారుల చెర నుంచి తన రూ. 40 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకున్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి చొరవతో ఆమెకు సకాలంలో న్యాయం చేకూరింది. రాజకీయ ఒత్తిళ్లను సైతం లెక్కచేయకుండా నిందితులపై కఠినంగా వ్యవహరించి, వృద్ధురాలికి బాసటగా నిలిచిన సీపీపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన సదరు మహిళకు సుమారు రూ. 40 కోట్ల విలువైన ఖాళీ స్థలం ఉంది. దశాబ్దాలుగా ఆ భూమి ఆమె స్వాధీనంలోనే ఉన్నప్పటికీ, ఇటీవల కొందరు భూకబ్జాదారులు ఆ ఆస్తిపై కన్నేశారు. అక్రమంగా స్థలంలోకి చొరబడి, అది తమదేనంటూ సదరు వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో బాధిత మహిళ ధైర్యంతో మల్కాజ్‌గిరి సీపీ సుమతిని ఆశ్రయించారు. తన భూమికి సంబంధించిన అన్ని దస్తావేజులను సమర్పించి, న్యాయం చేయాలని అభ్యర్థించారు. వృద్ధురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఆ భూమి బాధితురాలిదేనని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా కబ్జాదారులు ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయినప్పటికీ సీపీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, ఆ స్థలం తమదేనని వాదిస్తున్న వారిని పిలిపించి ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. వారు సరైన పత్రాలను చూపలేకపోవడంతో, ఆ భూమి వృద్ధురాలిదేనని అధికారులు తుది నిర్ధారణకు వచ్చారు. కోట్లాది రూపాయల విలువైన తన ఆస్తి తిరిగి దక్కడంతో ఆ వృద్ధురాలు హర్షం వ్యక్తం చేశారు. సీపీ సుమతి ప్రదర్శించిన చొరవను, వృత్తిపరమైన నిబద్ధతను స్థానికులు కొనియాడుతున్నారు. భూకబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Latest