Mahaa Daily Exclusive

  అసెంబ్లీలో మైకులు బంద్‌….

Share

అసెంబ్లీలో మైకులు బంద్‌.
* తెలంగాణ భవన్‌లో మాక్‌ అసెంబ్లీ షురూ!
* సభ నుంచి సస్పెన్షన్‌.. బయట బీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయ అసెంబ్లీ.
* రైతు భరోసా నుంచి 22ఏ వరకు.. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ‘రోల్‌ ప్లే’

హైదరాబాద్‌, మహా:

శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మైకులు నిలిపివేసి సస్పెండ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందుకు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అసెంబ్లీ నుంచి బయటకు పంపితే ఏం చేయాలన్నట్లుగా తెలంగాణ భవన్‌లోనే మరో అసెంబ్లీని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ కుర్చీ, మైకులు, సభ్యుల బెంచీలు ఏర్పాటు చేసి ‘మాక్‌ అసెంబ్లీ’ నిర్వహించారు.

అసలైన అసెంబ్లీలో తమ గొంతు వినిపించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. దీంతో తెలంగాణ భవన్‌ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాక్‌ అసెంబ్లీని నిర్వహించారు. అసెంబ్లీ తరహాలోనే సభను ఏర్పాటు చేసి.. స్పీకర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను కూడా నేతలకు కేటాయించారు.

జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావును స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ మంత్రుల పాత్రల్లో కనిపించారు. సభ నిర్వహణ కూడా అసెంబ్లీని తలపించేలా కొనసాగింది. దీంతో తెలంగాణ భవన్‌లో రాజకీయంగా ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది.

అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అవకాశం దక్కలేదని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్న పలు ప్రజా సమస్యలను మాక్‌ అసెంబ్లీలో లేవనెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి, 22ఏ భూముల అంశం తదితర అంశాలను చర్చకు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధిస్తూ.. ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపైనా బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మాక్‌ అసెంబ్లీ వేదికగా ప్రశ్నలు సంధించారు. రైతులకు సంబంధించిన సమస్యలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు, నిరుద్యోగుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు.

శాసనసభలో ప్రతిపక్షానికి తగిన సమయం, అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన సభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. తమను సభ నుంచి సస్పెండ్‌ చేసినా.. ప్రజల తరఫున ప్రశ్నించడం మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు.

అసెంబ్లీ బయట మాక్‌ అసెంబ్లీ నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య అసెంబ్లీ సమావేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరో రూపంలో తెలంగాణ భవన్‌కు చేరినట్లయింది. సభలో మైకులు నిలిపివేస్తే.. బయట మరో వేదిక ఏర్పాటు చేసుకుని తమ వాదన వినిపిస్తామన్న రీతిలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

అయితే మాక్‌ అసెంబ్లీ ద్వారా బీఆర్‌ఎస్‌ లేవనెత్తుతున్న అంశాలు ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు నిరసనగా ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహంగా మారుతుందా, లేక ప్రతిపక్ష ప్రచార కార్యక్రమానికే పరిమితమవుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.